చంద్రబాబు సభపై రాళ్ల దాడి జరగలేదు.... సానుభూతి ఓట్ల కోసమే నాటకాలు: హోం మంత్రి సుచరిత
నిన్న తిరుపతిలో రోడ్ షో నిర్వహిస్తుండగా తమపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగలేదని వెల్లడించారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో సానుభూతి ఓట్లు పొందడం కోసమే ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్ల దాడి నాటకాలకు తెరలేపారని వివరించారు. వైసీపీ నేతలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, రాళ్ల దాడి చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి బరిలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని సుచరిత ధీమా వ్యక్తం చేశారు.